Friday 12 April 2013

ఎజెండా సెట్టర్ సోషల్ మీడియా!

ఓటర్ల చేతుల్లో బ్రహ్మాస్త్రం

2104 జనరల్ ఎన్నికలు నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ నాయకత్వ పటిమకు పరీక్ష కాబోతున్నాయి. అంతేకాదు సోషల్ మీడియా ప్రభావం కూడా ఈ ఎన్నికల మీద గణనీయంగా ఉంటుందని సర్వేలు తేల్చాయి. 

 ఐరీస్ నాలెడ్జ్ ఫౌండేషన్, ఇండియన్ ఇంటర్నెట్, మోబైల్ యూజర్స్ అసోసియేషన్ నిర్వహించిన  అధ్యయనం ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన అంశాలను బయటపెట్టింది. ఇకపై ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నవారే కాదు ఫేస్ బుక్ అక్కౌంటు హోల్డర్స్ కూడా అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ధారించనున్నారు. ఇది శుభపరిణామమే. 

 నరేంద్ర మోడీ నిరుడు డిసెంబర్  ఎన్నికల్లోగుజరాజ్ ఓటర్లను ఆకట్టుకోవడంలో టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. దేశంలో ఏ ముఖ్యమంత్రికీ లేనటువంటి హైటెక్ పోకడ నరేంద్ర మోడీకి ఉంది. ఫేస్ బుక్ చాటింగులు, ట్విటర్లో అభిప్రాయాలను షేర్ చేసుకోవడం, వెబ్ సైట్లో వివరాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయడంలో మోడీ టీం ముందుంటుంది. ఎన్నికల ప్రచారంలోనూ మోడీ ఈసారి వెరైటీగా త్రీడీ పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నారు. రాహుల్ గాంధీ కూడా టెక్ సావీయే. అయితే ఇంకా సోషల్ మీడియాలో ఓపెన్ అవ్వాలి. ప్రజలకు పేస్ బుక్, ట్విటర్, వెబ్, మెయిల్ మార్గాల ద్వారా ఇంకా ఇంకా దగ్గరవ్వాలి. నాయకులు మాత్రమే కాదు ఓటర్ల కూడా టెక్నాలజీ మార్గాల ద్వారా ఒక్కతాటిపైకి వస్తున్నారు. ఆ ప్రభావం ఏంటన్నది వచ్చే ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని సర్వేలు వెల్లడించాయి.

యూత్ ఫుల్ థాట్స్

నిర్భయ ఘటన తర్వాత దేశమంతా నిరసనలు వెల్లువెత్తాయంటే సోషల్ మీడియాయే జనాన్ని ఏకాభిప్రాయం దిశగా నడిపింది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం కెరటంలా ఉప్పొంగిందంటే సమాచార సాంకేతిక విప్లవమే కారణం. అనేక అంశాల మీద యువతరం పోరాట మార్గంలో నడుస్తున్నది ఇలాగే. ఎవరూ పిలుపునివ్వకపోయినా సోషల్ మీడియాయే ఎజెండా సెట్ చేస్తోంది. ఒకే అంశం మీద యువతంతా ఒకే విధంగా స్పందించేలా చేస్తున్న పవర్ ఫుల్ ఆయుధాలు బ్లాగ్, ఫేస్ బుక్, ట్విటర్, మెయిల్, వెబ్ సైట్.


2014 ఎలక్షన్స్ లో ఫేస్ బుక్ ఎఫెక్ట్

వచ్చే ఎన్నికల్లో యువ ఓటర్లు వీటిని బాగా వినియోగించుకోబోతున్నారని తేలింది.
2014 పార్లమెంటు ఎన్నికల్లో  దేశంలోని 543 నియోజకవర్గాల్లో 160 చోట్ల సోషల్ మీడియా ఎపెక్ట్ ఉంటుందిట. అంటే నగరాలు, ప్రధాన పట్టణాల్లో నెటిజన్లు తమ సత్తా ఏమిటో చాటబోతున్నారన్నమాట!. 67 సెగ్మెంట్లలో ఓ మోస్తరు ప్రభావం ఉంటుందని తేలింది. 60 చోట్ల స్వల్ప ప్రభావం కనిపిస్తుంది. 256 నియోజకవర్గాల్లో ఈ మీడియా ప్రభావం అసలే ఉండదట. అంటే ఇవన్నీ గ్రామీణ ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలై ఉండవచ్చు. ఫేస్ బుక్ లేదా ఇతర సామాజిక అనుసంధాన మీడియాతో ఇక్కడి ఓటర్లకు లింకు లేనట్లు లెక్క.

ఏపీలో 11 సెగ్మెంట్లు కీలకం

మన రాష్ట్రంలో హైదరాబాద్, విశాఖ, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, కరీంనగర్, నరసరావుపేట, చిత్తూరు పార్లమెంటరీ స్థానాల్లో సోషల్ మీడియా ద్వారా కనెక్టయిన ఓటర్ల ప్రభావం ఎన్నికల ఫలితాల మీద కనిపిస్తుందని తేలింది. మహారాష్ట్రలో అత్యధిక ప్రభావం ఉండే నియోజకవర్గాలు 21 దాకా లెక్కతేలాయి. అదే గుజరాత్ లో 17 నియోజకవర్గాలున్నాయి. అత్యధిక ప్రభావం ఉండే నియోజకవర్గాలంటే మొత్తం ఓటర్లలో పది శాతానికన్నా ఎక్కువ ఫేస్ బుక్ అక్కౌంట్లున్న వారుండడమే. చివరి లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థి సాధించిన మెజారిటీ కన్నా ఎక్కువ సంఖ్యలో ఫేస్ బుక్ వాడకం దారులు ఉన్నట్లు లెక్క. అంటే ఈ మార్జిన్ లో ఉన్న ఓటర్లే అభ్యర్థి గెలుపోటములను ప్రభావితం చేయబోతున్నారన్న మాట!. ఈలెక్కన మన రాష్ట్రంలో పదకొండు నియోజకవర్గాల్లో సోషల్ మీడియా ప్రభావం అత్యధికంగా ఉన్నట్లు అంచనా. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సంఖ్య దాదాపు సమానంగానే ఉంది. దినపత్రికలు, టీవీ న్యూస్ ఛానళ్లు కొనేసుకుని అదేపనిగా ఊదరగొట్టేస్తూ సొంత ప్రచారం చేసుకునే నాయకులకు సోషల్ మీడియా సరికొత్త సవాల్ విసరబోతున్నట్లే. అభ్యర్థులను అందలమెక్కించడానికీ, చాపకిందనీరులా పునాదులను కదిలించడానికీ సోషల్ మీడియా పనిచేస్తుంది. యువతరం ఆగ్రహించిందంటే ఎలాంటి నాయకుడికైనా డేంజరే. తమ అరచేతుల్లోనే ఉంది అతిపెద్ద ఆయుధం అదే సోషల్ మీడియా. బీ కేర్ ఫుల్!

No comments: