Monday 29 April 2013

రష్యన్లు మెచ్చిన సైకత గణపతి

ఇసుకకు ప్రాణంపోసే పట్నాయక్!

ఒక్క కాకికి కష్టమొస్తే వంద కాకులు గుమికూడుతాయి. మానవత్వం ఉన్న మనిషి ప్రపంచంలో ఏ మూల ఎవరికి కష్టమొచ్చినా స్పందిస్తాడు. ఈరోజుల్లో అలా స్పందించే వారే కరువైపోతున్నారు. తెనాలిలో ఆకతాయిలు తన బిడ్డను అల్లరిచేస్తే అడ్డుకున్న ఓ తల్లిని నిర్ధాక్షిణ్యంగా లారీ కిందకు తోసేశారు. కొన ఊపిరితో ఉన్న ఆ తల్లిని రక్షించుకోవడానికి ఆ బిడ్డ ఎంత ప్రాధేయపడినా చుట్టుపక్కలవారెవరూ ముందుకు రాలేదు. ఏ ఒక్కరిలో స్పందించే గుణమున్నా ఆ తల్లి బతికేందుకు కొంత అవకాశముండేది. రాజస్థాన్ జైపూర్ లో బండి మీదెళ్తున్న ఓ కుటుంబాన్ని వాహనం ఢీకొట్టేసింది. తల్లీ, బిడ్డా నడిరోడ్డు మీద రక్తం మడుగులో కొట్టుకుంటున్నా ఒక్క వాహనమూ ఆగలేదు. ఎవరైనా సాయం చేయండి బాబూ అంటూ ఆమె భర్త రోడ్డు మీద పడిపోయిన మరో బిడ్డను పట్టుకుని  నెత్తీనోరూ బాదుకున్నా ఏ మనిషీ కనికరించలేదు. గుండెలను బండరాళ్లలా మార్చేసుకున్న మనుషులు ఎక్కువైపోయిన సమాజమా మనది?!. కానీ ప్రపంచంలో ఎక్కడ ఏ సమాజానికి ఆపద వచ్చినా ఓ వ్యక్తి మాత్రం స్పందిస్తాడు అతడే సుదర్శన్ పట్నాయక్. 

సైకత గణపతి పక్కనేసుదర్శన్ పట్నాయక్

పరమార్ధం తెలిసిన పట్నాయక్

సుదర్శన్ పట్నాయక్ కు తెలిసిన విద్య... సముద్రం ఒడ్డున ఇసుకతో శిల్పాలు తీర్చిదిద్దడం. ఒడిషాలోని పూరి జగన్నాధుడంటే అందరికీ తెలిసినట్లుగానే అదే పూరికి చెందిన సుదర్శన్ పట్నాయక్ కూడా ప్రపంచ కళాకారులందరికీ చిరపరిచితుడయ్యాడు. మనదేశంలో మొట్టమొదటి సైకతశిల్లి ఇతనే. సమాజానికి దర్పణం పట్టే కళాకారుడితడు. 

ఎయిడ్స్ పై అవగాహన కల్పించే శిల్పాలు

 ఆ చేతి వేళ్లు తాకిన ఇసుక... కరువు కాటేసిన రైతు రూపంలోకి మారిపోతుంది. కామాంధుడు కాటేసిన ఢిల్లీ "నిర్భయ"కు కన్నీటి నివాళులర్పిస్తుంది. సుదర్శన్ పట్నాయక్ కళా హృదయం అన్నిరకాల అంశాలకు స్పందిస్తుంది. ఇసుక మేటల్లో  బావుకతనిండిన సైకత రూపాలను సృష్టిస్తుంది.

ఒబామాను అభినందిస్తూ

మాస్కోలో జైబోలో గణేశ్...

ఇప్పుడు ఈ సైకత శిల్పి గురించి ఎందుకింతలా స్పందించానంటే... మాస్కోలో నిర్వహించిన వరల్డ్ ఆర్ట్ ఛాంపియన్ షిప్  పోటీల్లో అరుదైన భారతీయ సైకతశిల్పికి బహుమతి వచ్చింది. పన్నెండడుగుల వినాయకుడి శిల్పాన్ని ఇసుకతో రూపొందించి ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు పట్నాయక్. ప్రపంచ శాంతికి బొజ్జ గణపయ్య చిహ్నమనేది ఈ సైకతశిల్పి భావన. నిజమే సర్వ విఘ్నాలనూ దూరం చేసి లోకానికి శాంతి ప్రసాదించే ఏకదంతుడు శాంతి కాముకుడే. "గ్లోబల్ శాంతి బహుమతి' వినాయకుడికే సొంతం.

భూమాతను రక్షించడమే మన కర్తవ్యం

పిచ్చుకగూళ్ల వయసులోనే...

రష్యాలో గణపయ్యకు రూపమిచ్చి అవార్డు అందుకున్న పట్నాయక్ ఇలాంటి బహుమతులను ఎన్నో సొంతం చేసుకున్నారు. ఇసుకలో పిచ్చుకగూళ్లు కట్టుకునే బాల్యం నుంచే పట్నాయక్ కు కళాఖండాలు తీర్చిదిద్దే విద్య అబ్బింది. ఏడేళ్ల వయస్సు నుంచే సైకత శిల్పాలు చెక్కుతూ 1998 నుంచి ఇప్పటివరకూ వందల పురస్కారాలు అందుకున్నాడు. గోల్డెన్ శాండ్ ఆర్ట్ ఇనిస్టిట్యూట్ పేరుతో ఓ సంస్థ ఏర్పాటు చేసి వందల మంది ఔత్సాహికులకు ఈ కళలో శిక్షణ ఇస్తున్నాడు. 

వివేకానందుడి జయంతి వేళ అరుదైన నివాళి

 ఎయిడ్స్ నిరోధం, పర్యావరణ పరిరక్షణ, మహిళల భద్రత, గ్లోబల్ వార్మింగ్ తదితర సామాజిక అంశాలపై సమయానుకూలంగా శిల్పాలు రూపొందించి జనంలో అవగాహన పెంచుతున్నాడు. ఇప్పటికే యాభైకిపైగా అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. అవార్డులు రివార్డులకన్నా ప్రజా సమస్యలపై తక్షణం స్పందించే గుణం, మంచి మనసున్న ఈ కళాకారుడిని ప్రజలంతా మెచ్చారు. 36 ఏళ్ల వయసులో ఇంతకంటే ఏం సాధిస్తే సంతృప్తి  దొరుకుతుంది...?!

(ఇమేజెస్ అన్నీ గూగుల్ ద్వారా తీసుకున్నవే. ఒరిజినల్ ఫొటోగ్రాఫర్లకు, వాటిని ప్రచురించిన వెబ్ సైట్ ఓనర్లకు కృతజ్ఞతలు)

No comments: