Monday 22 April 2013

వివేకం నేర్పని పాఠాలు!

విలువలు తెలిస్తేనే విజ్ఞానం!
చిన్నారులకు ముఖ్యంగా బాలికలకు భద్రత కరువైన దౌర్భాగ్యం పట్టింది మనసమాజానికి. చిన్నారులు రోజులో ఎక్కువ భాగం ఉండేది  స్కూళ్ల లోనే. రేపటి తరాన్ని తీర్చిదిద్దే విద్యాలయాల్లోనే సేఫ్టీ లేకుండాపోతోంది. 

ఢిల్లీ సహా అనేకచోట్ల పిల్లల మీదే అఘాయిత్యాలు ఎక్కువవుతున్నాయ. ఈమధ్య ఢిల్లీ స్కూల్లో ఓ 32 టీచరు ఎల్కేజీ చదువుతున్న అబ్బాయిని చాకొలెట్ ఆశచూపించి టాయ్లెట్లోకి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డ దారుణం కళ్లచూశాం. ఆ బాధిత పిల్లాడు ఇంటికొచ్చాక గానీ పేరెంట్స్ కు విషయం తెలియలేదు.

చాకొలెట్ ఎరతో చిన్నారులు బలి

చిన్నారులకు చాకొలెట్ అంటే అమితమైన ఇష్టం. అయితే వాటివల్లే 70 శాతం పిల్లలు తరచూ అనారోగ్యం పాలవుతున్నారని వైద్యనిపుణులు చెప్తున్నారు. అందుకే మన పిల్లలు మారాం చేసినప్పుడల్లా చాకొలెట్ ఆశ చూపించే పద్దతులు మార్చుకుంటే మంచిదేమో!. చాకొలెట్లే చిన్నారులకు ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ఢిల్లీలో 'గుడియా'ను ఇద్దరు కామంధులు చాకొలెట్ ఎరతోనే పట్టిబంధించారు. పళ్లు పాడైపోతాయంటూ తల్లిదండ్రులు కొనివ్వని చాకొలెట్లు ఎవరో ఇస్తున్నారనగానే  అభంశుభం తెలియని చిన్నారులు అమాయకంగా ఆ వలలో పడిపోతున్నారు. అసలు చాకొలెట్ తో ఆరోగ్యపరంగా ఎన్ని అనర్థాలున్నాయో పిల్లలకు తెలియచెప్పకపోవడం పెద్దవారి తప్పిదం. చాకొలెట్ తింటే ఆరోగ్యపరంగా పెద్ద ముప్పుంటుందని తెలిస్తే ఎవరో ఇచ్చే దాని కోసం ఆశపడి జీవితాన్నే ముప్పుపాల్చేసుకోరుకదా!

  • చాకొలెట్ తో నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది
  • దంతాలు పాడైపోతాయి, పళ్లు పుచ్చిపోతాయి
  • చెడు కొలెస్టరాల్ పెరుగుతుంది
  • శరీరం బరువు పెరుగుతుంది
  • ఊబకాయానికి దారితీస్తుంది
  • తరచూ దగ్గు, జలుబు లాంటివి బాధిస్తాయి
  • ఆయాసం, ఉబ్బసం ఉన్నపిల్లలకు మరింత ఇబ్బంది

విజ్ఞానంతో పాటు వివేకమూ...

గురువు పిల్లలకు విజ్ఞాన సంపదను అందించడమే కాదు నైతిక విలువలు బోధించి మంచి నడవడి తెలిసిన పౌరులుగా తీర్చిదిద్దాలి. సమాజంలో ఇందుకు భిన్నమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్లో ఓ పేరున్న ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపాలే తొమ్మిది, పది క్లాసుల అమ్మాయిలతో రాసక్రీడలు జరిపిన ఘటనలు కలకలం రేపాయి. ఇలా ఒకటి రెండూ కాదు నిత్యం డజన్లకొద్దీ వార్తలు. విద్యాలయాలు కూడా పిల్లలకు భద్రం కాదనేది రుజువైపోయింది. ఎత్తయిన గోడలు, నలుగురైదుగురు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నంత మాత్రాన అంతా భద్రం అనుకోడానికి లేదు.

 ఢిల్లీ స్కూళ్ల ముందడుగు

స్కూళ్లలో వేధింపులకు తావు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఢిల్లీ విద్యాసంస్థలు గుర్తించాయి. ఇటీవలి ఘటనల నేపథ్యంలో దేశరాజదాని విద్యాసంస్థల యజమాన్యాలు తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి వేధింపుల అంశంపై చర్చిస్తున్నాయి. క్లాస్ రూమ్ లోనే కాకుండా స్కూలు ఆవరణలో ఎక్కడ ఏ విద్యార్థి ఏం చేస్తున్నాడనేది మానిటర్ చేసేందుకు సీసీ కెమెరాలు అమర్చే పనిలో పడ్డారు. అంతేకాదు టీచర్లు, ఇతర సహాయ సిబ్బంది ప్రతికదిలిక మీదా సీసీ కెమెరా కన్ను ఉంటేనే గానీ విద్యార్థికి భద్రత లభించదు. సీసీ కెమెరాలుంటేనే సరిపోదు అనుమానాస్పద కదలికలు పసిగట్టగానే వారిపై నిఘా పెట్టడం, కఠిన చర్యలు తీసుకోవడం అవసరం. ఘోరాతిఘోరాలు జరిగాక దిక్కులు చూసేకన్నా ముందుజాగ్రత్తలు తీసుకోవడం తక్షణావసరం.

నైతికతే మొదటి పాఠం

బాలికలకు భద్రత కల్పించడం ఒకెత్తయితే, బాలురకు నైతిక ప్రవర్తన బోధించడం రెండో ఎత్తు. భద్రత కన్నా నైతిక ప్రవర్తనకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రతి స్కూల్లో పోలీసు అధికారులే సెమినార్లు నిర్వహించి లైంగిక వేధింపుల మీద పిల్లల్లో అవగాహన పెంచాల్సిన తరుణమిది. సామాజిక వేత్తలు, స్వచ్చంధ సంస్థల కార్యకర్తల సహాయం కూడా తీసుకోవచ్చు.

      ముఖ్యంగా బాలికలకు స్వీయభద్రతపై జాగ్రత్తలు చెప్పాలి. అప్రమత్తంగా వ్యవహరించడమెలాగో తెలియచేయాలి. కావాలంటే ఆత్మరక్షణ విద్యలైన కరాటె, కుంగ్ ఫూ లాంటివి నేర్పించాలి. అబ్బాయిలకు తప్పుచేస్తే ఎలాంటి శిక్షలు పడతామో స్పష్టంగా వివరించాలి. ప్రేమ, ఆకర్షణ పేరుతో అమ్మాయిల వెంట పడితే ముప్పుతప్పదని తెలియచేయాలి. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు లైంగిక వేధింపులను ఎలా ఎదుర్కోవాలో తల్లదండ్రులే అర్థమయ్యేలా చెప్పాలి. ఫ్రెండ్స్, బంధువులు, అపరిచితులు, టీచర్లు ఏ విధంగా అసహజంగా ప్రవర్తిస్తారో, అనుమానాస్పదంగా మాట్లాడతారో, అనైతిక చర్యలకు దిగుతారో పిల్లలకు ముందుగానే తెలిస్తే ప్రమాదాలను నివారించవచ్చు.  ఇవన్నీ ఎప్పుడో యుక్త వయసు వచ్చాక వారంతటవారే తెలుసుకుంటారులే అనే ఉదాసీనత తగదు. కేజీ చదువలప్పటి నుంచే హితబోధ మొదలైతే పీజీ వయసుల నాటికి తత్వం బోధపడుతుంది. సత్ పౌరులుగా, బాధ్యత తెలిసిన మనుషులుగా మన పిల్లల్ని మనే తీర్చిదిద్దాలి. ఇందుకు స్కూళ్లలోనే మొదటి అడుగు పడితే మంచిది.

స్కూళ్లలోనే ముప్పెక్కువ!

యూనిసెఫ్ సర్వే ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు ఎక్కువగా వేధింపులు ఎదుర్కొంటున్నది స్కూళ్లలోనే అనేది వాస్తవం. ఈమధ్య ఘటనలు చూస్తే లైంగిక వేధింపులు కూడా ఎక్కువేనని తెలుస్తోంది. వేధింపులంటే స్కూళ్లో పిల్లలకు ఎదురవుతున్న ప్రతి చేదు అనుభవమూ వేధింపు కిందే లెక్క. టీచర్లు అమానుషంగా దండించడం, పరుష పదాలు ఉపయోగించి తిట్టడం, టీచర్లు, సిబ్బంది లేదా సహచర విద్యార్థులు లైంగికంగా వేధించడం, భౌతికంగా దాడులకు పాల్పడడం, అవమానించడం అన్నీ బాధిత చిన్నారులను మానసికంగా, శారీరకంగా కుంగదీసేవే. అందుకే విద్యాసంస్థలు చైల్డ్ ఫ్రెండ్లీగా మారాల్సిన అవసరం ఉంది. ఇందుకు పేరెంట్స్, లోకల్ కమ్యూనిటీస్, పోలీస్, ఎక్స్ పర్ట్స్ సహాయం తీసుకోవాలి. సెమినార్ల ద్వారా చిన్నారుల్లో అవగాహన పెంచుతూ స్కూలంటే పూర్తిస్థాయి భద్రత ఉన్న దేవాలయం అనే భరోసా ఇవ్వాలి.

పవిత్రమైన సరస్వతీ నిలయాలుగా...

విద్యాసంస్థలను పవిత్రమైన సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దే బాధ్యత యజమాన్యాల మీదే ఉంది. తల్లిదండ్రులు, సామాజిక సంస్థలు ఈ బృహత్తర బాధ్యతకు నైతిక మద్దతునివ్వాలి. టీచర్లే ఐదారేళ్ల పాపల మీద అఘాయిత్యాలకు పాల్పడుతుంటే ఇక 'గురు శిష్య బంధానికి' విలువేముంటుంది? చిన్నారులంతా చాచాజీగా పిలుచుకునే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చెప్పిన ఆధునిక దేవాలయాలైన పాఠశాలలే చిన్నారులకు భద్రత కల్పించలేకపోతే ఇక సరస్వతీ నిలయాలకు పరమార్ధం ఏముంటుంది?   
 

No comments: