Friday 8 March 2013

యమహో నమ:

ముక్తిదాతకి ముందుగా పూజలు! 

మృత్యుదేవుడైనా ముక్తి ప్రధాత! నరకలోకాధిపతి అయినా పుణ్యకార్యాలు చేసిన వారిని కైలాసానికి పంపించే ధర్మదేవుడు. యముడ్ని ఏ విధంగానైనా కొలవడం అరుదు. తమిళనాడు కోయంబత్తూరులోని చిత్రపుత్ర యమధర్మరాజ ఆలయం, కుంభకోణంలో శ్రీవంచియం ఆలయాల్లో నిత్య పూజలందుకుంటున్నాడు లోకపాలకుడు. శివరాత్రి పర్వదినాన యముడి గురించి ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే మన కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలోనూ యముడు కాళేశ్వరుని రూపంలో లోక రక్షకుడైన ముక్తేశ్వరుని చెంతనే కొలువుదీరాడు.దక్షిణాన ఉన్న అరుదైన క్షేత్రాల్లో కాళేశ్వరం ఒకటి. స్కాంద, గౌతమీ పురాణాలు ఈ క్షేత్ర విశిష్టతను చాటుతున్నాయి.శివరాత్రి వేళ ఈ మహిమాన్విత క్షేత్రాన్ని దర్శించుకుంటే సకల పాపాలు హరించుకుపోతాయని నమ్మకం.  

కాకతీయుల శిల్పకళా సోయగం

దర్శించుకున్నా ముక్తే...

కాశీలో మరణించిన వారికి ముక్తి లభిస్తుందని విశ్వసిస్తాం. కానీ కాళేశ్వరంలో ఒకే పానవట్టం మీదున్న రెండు లింగాలను దర్శించుకుంటే తప్పకుండా ముక్తి  ప్రాప్తిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఒకే పానవట్టం మీద రెండు లింగాలుండడం ఇక్కడి విశిష్టత. ఒకటి కాలుడు అంటే కాళేశ్వరుడు, రెండోది శివుడు అంటే ముక్తేశ్వరుడు. యుముడ్ని, శివుడ్ని కొలిచే అరుదైన క్షేత్రం కాళేశ్వరం.

కాలుడెలా వచ్చాడు...

భూలోకంలో మరణాలు తగ్గిపోయిన ఒకానొక సందర్భంలో యముడు సృష్టిలయకారకుడైన శివుడికి మొరపెట్టుకున్నాడుట. దీంతో వరం ప్రసాదించిన కైలాసపతి శ్రీకాళేశ్వరంలో ముక్తేశ్వరుడిగా వెలిసాడు. ఆ పక్కనే కాళేశ్వరుడి రూపంలో యముడికి చోటిచ్చాడు. అందుకే ఒకే పానవట్టం మీద రెండు లింగాకారాలు. ఈ క్షేత్రంలో కాళేశ్వరుడ్ని ముందు దర్ఙంచుకున్నాకే ముక్తేశ్వరుడిని పూజించాలి. అదే భక్తులకు ముక్తిమార్గం.

ఒకే పానవట్టం మీద కాళేశ్వర, ముక్తేశ్వరులు

ముక్తిప్రధాతకెన్నో మహిమలు...

ముక్తేశ్వరుడి రూపమైన లింగాకారానికి రెండు నాసికా రంద్రాలుంటాయి. ఎన్ని నీళ్లు పోసి అభిషేకం చేసినా అవన్నీ చెంతనే ఉన్న నదీ సంగమంలో అంతర్వాహినిగా ఉన్న సరస్వతీ నదిలో కలుస్తాయని ప్రతీతి. ఇకప్పుడు భక్తులు ఈ లింగం మీద పాలుపోస్తే సంగమంలో నీళ్లన్నీ తెల్లగా మారాయని చెప్తారు.

దక్షిణ గంగోత్రి..త్రిలింగ క్షేత్రం

పవిత్ర గోదావరి, దాని ఉప నదైన ప్రాణహిత, అంతర్వాహిణిగా సరస్వతీ నదుల సంగమం ఇది. అలహాబాద్, ప్రయాగ సంగమాలంతటి విశిష్టత ఉన్నందునే దక్షిణ త్రివేణి, దక్షిణ గంగోత్రి అంటారు. తెలుగు ప్రాంతానికి మూలమని భావించే త్రిలింగదేశానికి... కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం పుణ్యక్షేత్రాలే ఆధారం.

ముక్తిమార్గం చూపించే దక్షిణ గంగోత్రి

విబూది ఉండల మహిమ

కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం శిల్పకళా సంపదతో అలరారుతోంది. యుముడ్ని, శివుడ్ని ఏకకాలంలో కొలిచే భక్తులే కాదు ఇక్కడి మట్టి కూడా పరమపావనమే. ఆలయ పరిసరాల్లో ఎక్కడ తవ్వినా ఆదిబిక్షువుకి ప్రీతిపాత్రమైన విబూది లభిస్తుంది. పవిత్ర నదీ సంగమంలో వెలిసిన కాళేశ్వరం పావన పుణ్యభూమిగా మారింది. ముక్తిధామమైంది.

ఎలా వెళ్లాలి...

కరీంనగర్ జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దున పచ్చటి ప్రకృతి మధ్య వెలిసిన కాళేశ్వరం... హైదరాబాద్ నుంచి 278 కిలోమీటర్లుంటుంది(కరీంనగర్-125 కి.మీ, వరంగల్-115 కి.మీ, మంథని-60కి.మీ). ఈ మూడు నగరాల నుంచి నేరుగా బస్సు సౌకర్యం ఉంది. దూరతీరాల్లో ఉన్న క్షేత్రాలకు వెళ్లాలంటే ఎన్నో వ్యయప్రయాసలు. మన చెంతనే ఉన్న కాళేశ్వరం లాంటి మహిమాన్విత క్షేత్రాలను  దర్శించుకుందాం. పుణ్యప్రాప్తిని పొందుదాం. ఓం నమ: శివాయ:   

No comments: