Saturday 9 March 2013

పూజలు చేయా... 'ఆకు' తెచ్చాను!

ఒక్క ఆకుతో కోటి కోర్కెలు!
ఒక్క ఆకుతో పూజించినా కోటి కోర్కెలనైనా తీర్చే దేవుడు శివుడు. ఆదిదేవుడు నిర్వికారుడు... నిరాండంబరుడు. ఆ పార్వతీపతిని పూజించాలంటే భక్తులు కూడా ఆర్భాటాలకు, ఆడంబరాలకు పోనక్కరలేదు.పుష్పం, పత్రం, తోయం...ఇందులో పువ్వులు లేకపోయినా ఆకులు, నీళ్లూ ఉంటే చాలు శివుడు సంతృప్తి చెందుతాడు. బిల్వం.. అంటే మారేడు పత్రాలంటే శంకరుడికి ఎంతో ప్రీతి. అలాగే జలాభిషేకంతోనే ఆయన కరుణపొందవచ్చు. అందుకే అన్నారు..

మారేడు ఫలంతో వంటింటి వైద్యం 

 

బిల్వానాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం!

అఘోర పాపసంహారం-ఏకబిల్వం శివార్పణం!!

(బిల్వ పత్రం దర్శించుకుంటే పుణ్యం వస్తుంది. తాకితే సర్వపాపాలు దూరమవుతాయి. అదే పత్రాన్ని శివుడికి భక్తితో సమర్పిస్తే మనం ఈ జన్మలో చేసిన ఘోరాతిఘోరమైన పాపాలకు ప్రాయశ్చిత్యం కలుగుతుంది)

ఏకబిల్వం శివార్పణం...

త్రిమూర్తుల రూపం బిల్వదళం

బిల్వదళం మూడు ఆకులతో ఉంటుంది. అందులో ఎడమ వైపునున్నది బ్రహ్మ, కుడి వైపునున్నది విష్ణు, మధ్య ఉన్న ఆకు శివుడి రూపమని విశ్వాసం. అందుకే మూడాకులున్న బిల్వదళాన్ని మాత్రమే సమర్పించాలి. ఇది త్రిశూలానికి సంకేతం. మారేడుని శ్రీఫలం అంటాం. అంటే లక్ష్మీదేవికి ప్రతిరూపం. అందుకే శివానుగ్రహం కోసం కోటి బిల్వ పత్రాలతో పూజించాలనే విశ్వాసం వ్యాప్తిలోకి వచ్చింది. కానీ మోక్షం పొందడానికి ఒక్క బిల్వ పత్రమున్నాచాలు. అందుకే ఓ భక్తుడు ప్రశ్నిస్తున్నాడు- 'మా రేడు నీవని ఏరేరి తేనా... మారేడు దళములు నీపూజకు...'.

శివ పూజకు నినుచేరితి...

మారేడుతో వేనవేల లాభాలు

మారేడు వృక్షం నుంచి గాలి సోకితేనే ఆరోగ్యం. అందులో సూర్య శక్తి, తేజస్సు ఉంటుంది.శరీరంలోపలా, బయటా చెడును హరిస్తుంది. మారేడు ఆకుల కషాయం తాగితే అరుచి దూరమవుతుంది. జఠరాగ్నిని బాగా రగులుస్తుంది కాబట్టి ఆకలి పుడుతుంది. శ్లేష్మాన్ని, అతిసారాన్ని పోగొడుతుంది. మారేడు ఆకులను నూరి శరీరానికి రాసుకుంటే చర్మసంబంధ వ్యాధులు దూరమవుతాయి. చమట, దుర్వాసం సమస్య తగ్గుతుంది.కంటి మీద లేపనంగా రాసుకుంటే కంటి వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఆయుర్వేదం ప్రకారం మారేడు ఆకులు, వేర్లు, బెరడు, కాయలు అన్నీ మనిషికి ఉపయోగపడతాయి.
మారేడు భక్తికీ ముక్తికీ, ఆరోగ్యానికీ ఉపయోగపడుతుంది.

 'అనంత వ్రత కోటీనాం... ఏకబిల్వం శివార్పణం...' 

అంటే ఒక్క బిల్వ పత్రాన్ని శివుడికి సమర్పించడం కోటి వ్రతాల పుణ్యఫలం పొందినంత సమానం.

శివోహం!

No comments: